Studio18 News - ANDHRA PRADESH / Srikakulam : తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, నటుడు-రాజకీయ నేత విజయ్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రేపటి నుంచి చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గంలో ఆయన తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఈ పరిణామం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ప్రచార కార్యకలాపాల కోసం విజయ్ ఇప్పటికే కొడుంగైయూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్లో ఒక బంగ్లాను సిద్ధం చేసుకున్నారు. రేపు ఉదయం ఆ నివాసంలో పూజలు నిర్వహించి, అనంతరం పెరంబూర్ నియోజకవర్గంలో పర్యటనకు బయలుదేరనున్నారు. రాబోయే రెండు రోజుల పాటు ఆయన స్థానికులతో మమేకమవుతూ, ఓటర్లను కలిసి మద్దతు కోరనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్డీఏ వంటి ప్రధాన కూటములు అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశాయి. ఈసారి తమిళనాట ఎన్నికలు చతుర్ముఖ పోటీగా మారే అవకాశం కనిపిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు నామ్ తమిళ్ కట్చి (ఎన్టీకే), విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా స్వతంత్రంగా పోటీ చేసే సూచనలు ఉన్నాయి. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సరళిని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Admin
Studio18 News