Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. కేజీహెచ్ వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. అక్కడి మార్చురీ వద్ద మృతుల బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కేజీహెచ్లో మొత్తం 12 మృతదేహాలు ఉన్నాయి. మృతులపై కనీసం సమాచారం ఇవ్వడంలేదని, మృతదేహాలను కనీసం చూడనివ్వడం లేదని బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. మార్చురీ వద్దకు కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. సాల్వెంట్ లీకేజీ వల్ల ప్రమాదం సంభవించి అగ్నికీలలు వ్యాపించాయని ఆయన చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే, గాయాలపాలైనవారికి.. తీవ్రతను బట్టి పరిహారం అందుతుందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. ప్రమాదం గురించి అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. కాగా, ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Admin
Studio18 News