Studio18 News - ANDHRA PRADESH / : ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమావేశం కానున్నారు. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి భారీ ఎత్తున జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. పోర్టు వద్ద తనకు ఎదురైన అనుభవాలను ఆయన మీడియా ముందు వ్యక్తం చేయడం తీవ్ర సంచలనం అయింది. అధికారుల తీరుపైనా మండిపడ్డారు. రేపు కేబినెట్ భేటీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబుతో పవన్ భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ప్రధానంగా కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు ఇతర అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపైనా వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అంశంపై పవన్ కల్యాణ్ చాలా సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యాపారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నేతల ప్రమేయం కూడా ఉందని, పెద్ద పెద్ద వ్యక్తులు దీని వెనుక ఉన్నారని వార్తలు రావడంతో సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : మహిళా కానిస్టేబుల్ ను కడతేర్చిన సోదరుడు.. కులాంతర వివాహమే కారణం
Admin
Studio18 News