Studio18 News - ANDHRA PRADESH / : Gossip Garage : ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కాం ప్రకంపనలు సృష్టించబోతుందా? గత ఐదేళ్లు అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచేసిన బడా బాబుల జాతకాలు బయటపడనున్నాయా? కూటమి నేతలు గుట్టుగా కూపీలాగుతున్న టీడీఆర్ స్కాంలో అసలు సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎందరు? ఎవరి మెడకు ఉచ్చుబిగిస్తోంది. సర్కార్ ఆలోచనలేంటి? వైసీపీ నేతల వాదనలు ఏంటి? వాస్తవ విలువకు వంద రెట్లు రెట్టింపుతో బాండ్లు జారీ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి చేపట్టిన అనేక విచారణల్లో టీడీఆర్ స్కాం ఒకటి. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల్లో భూసేకరణకు సంబంధించి వందలాది టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. ఐతే వాస్తవ విలువకు వంద రెట్లు రెట్టింపుతో బాండ్లు జారీ చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని… వేల కోట్లు కొల్లగొట్టారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై అధికారులతో ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. మరోవైపు ఏసీబీ కూడా ఈ స్కాంపై ఆరా తీస్తోంది. వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పవనే సంకేతాలు.. ప్రాథమికంగా అందిన సమాచారంతో తణుకు మున్సిపాలిటీలో పని చేసిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేశారు. ఇక నేతల వంతు మాత్రమే మిగిలి ఉందని మంత్రి నారాయణ ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఫిర్యాదులు ఉన్న ప్రతిచోటా వైసీపీ నేతలను బాధ్యులను చేస్తారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే నెలలో అధికారుల నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో వచ్చే నెలలో పలువురు వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పవనే సంకేతాలు పంపినట్లేనంటున్నారు పరిశీలకులు. ఒక్క తణుకు మున్సిపాలిటీలోనే రూ.600 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం.. గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. ఐతే విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తణుకు వంటి మున్సిపాలిట్లో ఎక్కువ అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒక్క మున్సిపాలిటీలోనే సుమారు 600 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రభుత్వం గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో గతంలో పనిచేసిన తణుకు మున్సిపల్ కమిషనర్తోపాటు మరో ఇద్దరు ఉద్యోగులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. టార్గెట్ భూమన, అవంతి, గుడివాడ.. ఇక విశాఖ, తిరుపతి, గుంటూరు కార్పొరేషన్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్లో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. అదేవిధంగా విశాఖలో మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్తోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందినట్లు చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ మాజీ ప్రజాప్రతినిధులకు ఉచ్చు బిగిసినట్లే.. టీడీఆర్ స్కాంపై విచారణ జరుపుతున్న అధికారులు… రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో తప్పులు జరిగినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సేకరించిన భూమికి ఎకరాల రూపంలో డబ్బు చెల్లించాల్సివుండగా, చదరపు గజాలు లెక్కన లెక్కగట్టినట్లు గుర్తించారు. భూమికి మార్కెట్ విలువ ఇవ్వాల్సివుండగా, సేకరించిన భూమికి దూరంగా విలువైన భూముల రేటు ఎంత ఉంటే అంతే చెల్లించేలా బాండ్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ప్రతిచోటా ఇలాంటి స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించడంతో భారీ ఎత్తున ఉద్యోగులు బలయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అధికారులు, ఉద్యోగులు అప్రూవర్లుగా మారి తమతో తప్పులు చేయించిన నేతల వివరాలు ఇస్తే… మున్సిపాలిటీ ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ మాజీ ప్రజాప్రతినిధులకు ఉచ్చు బిగిసినట్లే అంటున్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలో భారీ స్కాం బయటపడే సూచనలు.. ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం టీడీఆర్ స్కాంపై సీఐడీ విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుతో చర్చించారు. ప్రాథమిక నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుందామని సీఎం చెప్పడంతో సెప్టెంబర్లో నివేదిక వచ్చేవరకు వేచిచూడనున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇదే సమయంలో అధికారులపై చర్యలు తీసుకుంటుండటంతో సంబంధిత నియోజకవర్గాల్లో వైసీపీ మాజీ ప్రజా ప్రతినిధులు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. వేల కోట్ల రూపాయల స్కాం జరగడంతో మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉండటంతో ఎవరి కొంప కొల్లేరు అవుతుందనేది సస్పెన్స్గా మారింది. మొత్తానికి వచ్చే నెలలో రాష్ట్రంలో భారీ స్కాం బయటపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Admin
Studio18 News