Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : డిప్యూటీ సీఎం పవన్ను కలిసిన జెన్ జెడ్ వ్లాగర్ స్వాతి రోజా ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న స్వాతికి పవన్ అభినందనలు శ్రీశైలంలో ఇబ్బందుల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాల ఏర్పాటు పవన్ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపిన యువ యాత్రికురాలు దేశవ్యాప్తంగా ఒంటరిగా బైక్పై ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న జెన్ జెడ్ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. సోమవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె పవన్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. స్వాతి చేస్తున్న సాహస యాత్ర వివరాలు అడిగి తెలుసుకుని, భవిష్యత్ ప్రయాణాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొన్ని వారాల క్రితం స్వాతి రోజా శ్రీశైలం సందర్శించారు. ఆ సమయంలో ఆమెకు వసతి, భద్రత పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి, ఆమెకు శ్రీశైలంతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం స్వాతి నేరుగా పవన్ కల్యాణ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశైలంలో తనకు ఎదురైన అనుభవాలను ఆమె పవన్తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బైక్ రైడింగ్, మోటార్ సైకిళ్లపై తనకున్న ఆసక్తిని స్వాతితో పంచుకున్నారు.
Admin
Studio18 News