Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : రైతుల సమస్యలపై వైసీపీ 'అన్నదాత పోరు' కార్యక్రమం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన వైఎస్ జగన్ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని వైసీపీ నేతల ఆరోపణ పలువురు వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు జారీ యూరియా కొరతపైనే తమ పోరాటమని స్పష్టీకరణ ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేత శ్యామల రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ తలపెట్టిన 'అన్నదాత పోరు' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునివ్వగా, ఈ క్రమంలో పలువురు వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. గత రెండు వారాలుగా రాష్ట్రంలో యూరియా తీవ్ర కొరత నెలకొందని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమస్యపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ, రైతులకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ 'అన్నదాత పోరు' కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఈ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమ పార్టీ నాయకులకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని పేర్కొంటూ నోటీసులు ఇస్తున్నారని, కార్యక్రమాల్లో పాల్గొనవద్దని రైతులను సైతం బెదిరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా తనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "వైఎస్ జగన్ అన్నదాత పోరుకు పిలుపునిస్తే కూటమి ప్రభుత్వం వణికిపోతోంది. యూరియా దొరక్క అల్లాడుతున్న రైతుల పక్షాన నిరసన తెలిపే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదా చంద్రబాబు గారూ?" అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై ఉక్కుపాదం మోపడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News