Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు' పేరుతో వేడుకలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జిల్లాలో శాంతిభద్రతలపై అధికారులతో సమీక్షా సమావేశం మూడు రోజుల పాటు ఘనంగా తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ప్రదర్శన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి (శుక్రవారం) మూడు రోజుల పాటు ఆయన పిఠాపురంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు' పేరుతో ముందస్తు సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. పర్యటన వివరాల ప్రకారం, గురువారం రాత్రికి పిఠాపురం చేరుకోనున్న పవన్ కల్యాణ్, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో జరగనున్న సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11:30 గంటలకు నియోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత మహోత్సవ ప్రాంగణంలోని సాంస్కృతిక కార్యక్రమాలను, ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం, ఇటీవల వర్షాలకు ముంపునకు గురైన పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇక తన పర్యటనలో రెండో రోజైన శనివారం ఉదయం, గొల్లప్రోలు మండలంలో పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉదయం 10:30 గంటలకు కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంటారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పిఠాపురం వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న ఈ సంక్రాంతి మహోత్సవాలను రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మొదటి రోజు (జనవరి 9) హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, జానపద గీతాలు, వీర నాట్యాలు, తప్పెట గుళ్లు, గరగల నృత్యాలు, థింసా, లంబాడీ వంటి గిరిజన, సంప్రదాయ నృత్యాలతో పాటు కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి. రెండో రోజు (జనవరి 10)... తొలి రోజు ప్రదర్శనల కొనసాగింపుతో పాటు కేరళకు చెందిన సంప్రదాయ యుద్ధ కళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక చివరి రోజు (జనవరి 11) గ్రామీణ జానపద కళాకారుల పాటలు, సినీ మ్యూజికల్ నైట్తో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
Admin
Studio18 News