Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి, ఇటీవలే పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు న్యాయశాస్త్ర ప్రవేశ పరీక్ష (లాసెట్)కు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో నేడు ఈ పరీక్ష రాశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, అనేక తప్పుడు అభియోగాలతో పాటు అక్రమంగా సస్పెన్షన్లు విధించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. రెండు విడతలుగా ఆయన సస్పెన్షన్లో కొనసాగాల్సి వచ్చింది. మొదటిసారి 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు, రెండోసారి 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30వ తేదీ వరకు ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. మొత్తంగా దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సుదీర్ఘ సస్పెన్షన్ అనంతరం ఆయన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి, అదే హోదాలో పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు నాలుగేళ్ల సస్పెన్షన్ కాలాన్ని పూర్తిగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన లాసెట్ పరీక్ష రాయడం చర్చనీయాంశంగా మారింది.
Admin
Studio18 News