Studio18 News - ANDHRA PRADESH / Chittoor : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి వీర మరణం పొందిన కార్తీక్ యాదవ్ అంత్యక్రియలు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానిపెంటలో నిర్వహించారు. మధ్యాహ్నం 3.45 గంలలకు ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు జవాను అంతిమ యాత్రను ఎగువ రాగిమానిపెంట గ్రామ వీధుల గుండా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటితో అమర జవానుకు తుది వీడ్కోలు పలికారు. జవాను అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు కె.మురళి మోహన్, గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలమనేరు ఆర్డిఒ భవాని, బంగారుపాళ్యం తహశీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, 4/8 గుర్ఖా రైఫిల్ బెటాలియన్ లెఫ్టినెంట్ శివరాజ్ సింగ్ గిల్ పాల్గొని నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో ఆర్మీ సిబ్బంది, పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. పదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన కార్తీక్ యాదవ్ రాజస్థాన్ ఆర్మ్డ్ రెజిమెంట్లో ఏడేళ్లపాటు పని చేశారు. రెండేళ్ల క్రితం జమ్మూకు బదిలీ అయ్యారు. జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు. కార్తీక్ మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మంత్రి నారా లోకేష్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వీరజవాన్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.
Admin
Studio18 News