Studio18 News - ANDHRA PRADESH / : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్లే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గెలిచారని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇందుకు గాను... కూటమి నేతలకు బొత్స ధన్యవాదాలు తెలిపి ఉంటే తాము హర్షించేవాళ్లమని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ అన్నింటినీ దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజాధనంతో విశాఖలోని రుషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని దుయ్యబట్టారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై కూటమి ప్రభుత్వం స్పందించలేదని జగన్ అనడం దారుణమని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం సంభవించిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని... బాధితులు సైతం ఆశ్చర్యపోయేలా ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించి, వెంటనే నష్టపరిహారాన్ని అందజేశారని చెప్పారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Admin
Studio18 News