Studio18 News - ANDHRA PRADESH / : ఏపీకి చెందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు. అయితే, మురళీ నాయక్ వీరమరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. వీర జవాన్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ప్రకటన విడుదల చేశారు. "ఆపరేషన్ సిందూర్లో భాగంగా జమ్మూకశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం" అని మంత్రి లోకేశ్ తెలిపారు.
Admin
Studio18 News