Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ కేబినెట్ భేటీ ఈరోజు జరగనుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానమైన ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి విధి విధానాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అలాగే 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపైనా కేబినెట్ చర్చించనుంది. ఇక రాష్ట్రంలోని వివిధ దేవాలయాల పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాలకమండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం ఆమోదం, తదుపరి చర్యలపై కేబినెట్ లో చర్చించనున్నారు. వచ్చే నెలలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు, ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకం, పోలవరం ప్రాజెక్టు తదితర కీలక అంశాలపై మంత్రి మండలిలో చర్చించనున్నారు. వీటితో పాటు వాలంటీర్ల కొనసాగింపు, వేతనాల చెల్లింపుపైనా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Admin
Studio18 News