Studio18 News - ANDHRA PRADESH / : కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మద్యం షాపులు దక్కించుకోవాలనుకునే ఆశావహులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల షెడ్యూల్ గడువు పెంచాలని కొరుతూ వివిధ జిల్లాల్లో ఉన్న దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున్న అభ్యర్థనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్కార్ షెడ్యూల్ను మార్చింది. 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించి, 14న మద్యం షాపులకు లాటరీ విధానంలో డ్రా తీసి, 16 నుంచి దుకాణాలను కేటాయిస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,396 మద్యం దుకాణాలకు గాను మంగళవారం రాత్రి వరకు 41,348 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 826.96 కోట్ల ఆదాయం వచ్చినట్టు సమాచారం. ఒక్కో దరఖాస్తుకు నాన్-రిఫండబుల్ కింద రూ. 2 లక్షలు చెల్లించాలన్న విషయం తెలిసిందే.
Admin
Studio18 News