Studio18 News - ANDHRA PRADESH / Alluri Sitaramaraju : మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మారేడుమిల్లి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నాయకులు సమావేశమయ్యారని, అక్కడ షెల్టర్ తీసుకున్నారని పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ భీకర పోరులో కీలక మావోయిస్టు నేతలు మరణించి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య, వారి వివరాలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Admin
Studio18 News