Studio18 News - ANDHRA PRADESH / : గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల రౌడీ షీటర్ దాడిలో గాయపడిన సహాన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొనడంతో పాటు బాధిత కుటుంబానికి పది లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో సహాన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.10 లక్షల చెక్కును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. రౌడీ షీటర్ల ఆగడాలను అదుపు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకోవడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఇల్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా హతురాలి తల్లి మంత్రిని కోరారు. కాగా, నిన్ననే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెనాలితో పాటు బద్వేల్ ఘటనలోని బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తామని ప్రకటించారు.
Admin
Studio18 News