Studio18 News - ANDHRA PRADESH / : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. 30 ఏళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అజెండా అని ఉద్ఘాటించారు.
Admin
Studio18 News