Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఉత్తర తమిళనాడుపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనం రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు రేపు ఏర్పడనున్న కొత్త అల్పపీడనం మరింత బలపడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనw ఆంధ్రప్రదేశ్పై అల్పపీడనాల ప్రభావం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా, రేపు మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ఇది రానున్న 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు కదులుతూ మరింత బలహీనపడనుంది. అయినప్పటికీ, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకోనుంది. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా శుక్రవారం (రేపు) ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఏర్పడిన తర్వాత 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
Admin
Studio18 News