Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కొత్త బాధ్యతలు చేపట్టిన నబీన్కు అభినందనలు తెలిపిన చంద్రబాబు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి నబీన్ నాయకత్వంలో బీజేపీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్ష బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శరవేగంగా పురోగమిస్తోంది. ఈ ప్రయాణంలో మేమంతా కలిసికట్టుగా పనిచేశాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం’’ అని స్పష్టం చేశారు. నితిన్ నబీన్ను యువకుడు, ఉత్సాహవంతుడిగా అభివర్ణించిన చంద్రబాబు, ఆయన వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ‘‘ప్రధాని మోదీ భారతదేశ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు. రైట్ టైమ్, రైట్ లీడర్, రైట్ డెసిషన్.. ఇదే నరేంద్ర మోదీ. అలాంటి కీలకమైన పార్టీకి నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టడం శుభపరిణామం. వారి నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Admin
Studio18 News