Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు (1+1) గన్మన్లు పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ కొన్ని రోజుల క్రితం చంద్రబాబును కలిసిన వర్మ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు భద్రతను కల్పించింది. ఆయనకు (1+1) పద్ధతిలో గన్మన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇద్దరు గన్మన్లు వర్మ వద్ద ఈరోజు విధుల్లో చేరారు. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, తనకు భద్రత కల్పించాలని వర్మ స్వయంగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, వర్మకు భద్రత అవసరమని తమ శాఖ నుంచి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నట్లు తెలుస్తోంది. కేవలం వర్మ అభ్యర్థన మేరకే ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని కేటాయించడం గమనార్హం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం వర్మ తన పిఠాపురం సీటును త్యాగం చేసిన విషయం తెలిసిందే. పవన్ గెలుపు కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో వర్మ త్యాగానికి తగిన గుర్తింపు లభిస్తుందని, ఆయనకు కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుతో వర్మ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులు, ఇతర రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ జరిగిన కొద్ది రోజులకే ఆయనకు భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో, వర్మకు త్వరలోనే ఏదైనా కీలక పదవి దక్కవచ్చనే ఊహాగానాలకు ఈ పరిణామం మరింత బలాన్నిచ్చింది.
Admin
Studio18 News