Studio18 News - ANDHRA PRADESH / : గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ నేత, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి చిక్కుల్లో పడ్డారు. టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ కేసును సీఐడీ లేదా ఇతర ప్రత్యేక విభాగానికి అప్పగించి మరింత లోతైన దర్యాప్తు చేయించాలని కోరింది. అక్రమాలకు కారకులైన అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో మంగళగిరిలో టిడ్కో ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారుల నుంచి చిరంజీవి బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఈ సిఫార్సు చేసింది. చిరంజీవి కొన్ని నెలలు వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
Admin
Studio18 News