Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో ఎన్నికలు అవినీతి మయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు. 1,800 బూత్లలో తమ ఓట్లు ఎలా మిస్సయ్యాయో ఆధారాలతో చెప్పానని తెలిపారు. తమ ఫ్యామిలీ నుంచి 25 మంది ఓట్లు వేస్తే రెండే చూపించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలు వాడిన 50 దేశాలు ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలని, మళ్లీ ఎన్నికలు జరిపించాలని అన్నారు. శ్రీ భరత్ పేరు వైజాగ్లో ఎవరికీ తెలియదని ఆయనకు ఓట్లు ఎలా పడ్డాయని నిలదీశారు. చంద్రబాబును అమెరికా రావాలని తాను కోరానని, అక్టోబర్ 2న సమ్మిట్ పెడదామని చెప్పానని అన్నారు. ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్నారని, తనతో కలిసి రావాలని, అప్పులు తీరుద్దాం, ఉద్యోగాలు సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇదే తన చివరి వార్నింగ్ అని, ఛలో అంటే జనాలు తనతో వచ్చి ధర్నాలు చేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడికి డెడ్ లైన్ ఇస్తున్నానని, వారం రోజుల్లోగా తనను కలవకపోతే, అక్టోబర్ 2 వ తేదీలోగా అమెరికా రాకపోతే తాను తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో దేవుడే నిర్ణయిస్తాడని హెచ్చరించారు.
Admin
Studio18 News