Studio18 News - ANDHRA PRADESH / : Goods Train Derailed : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒక బోగి పట్టాలు తప్పిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇవాళ తెల్లవారు జామున 4.40 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సమయంలో ఆ రూట్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లు రాకపోవడంతో రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో స్థానిక రైల్వే గేటు మూతపడింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తాజా ఘటన నేపథ్యంలో విజయవాడ – చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంత ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. ఇదిలాఉంటే గత నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటీన సంఘటన స్థలికి చేరుకొని మరమ్మతలు చేపట్టారు. అయితే, నాలుగు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఒకే ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం గమనార్హం.
Admin
Studio18 News