Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : లక్ష్మీ పురి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ పుస్తకాలు చదవడం వల్లే మానసిక పరిపక్వత వస్తుందన్న పవన్ పవన్ కల్యాణ్ తన అభిమాన నాయకుడని చెప్పిన మంత్రి సత్యకుమార్ పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని, తన జీవితంపై పుస్తకాల ప్రభావం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని, తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన 'ఆమె సూర్యుడిని కబళించింది' అనే పుస్తకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఏదైనా సాధించాలంటే పట్టుదల చాలా అవసరం. ఈ పుస్తకంలోని మాలతి పాత్ర నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. ఆ పాత్రలో ధైర్యసాహసాలు, మేధస్సు, స్వాతంత్ర్య కాలం నాటి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు కనిపిస్తాయి" అని వివరించారు. తన తల్లి వంట గది నుంచే ప్రపంచాన్ని చూశారని గుర్తుచేసుకున్నారు. భారతీయ ఆలోచనా విధానం నుంచే తాను వచ్చానని, మన దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందని పవన్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ మహిళా విభాగానికి 'ఝాన్సీ వీర మహిళ' అని పేరు పెట్టినట్లు గుర్తుచేశారు. ఇదే వేదికపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను త్వరలోనే అమలు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "పవన్ కల్యాణ్ నా అభిమాన నాయకుడు. నేను ఈ రోజు మంత్రిగా కాకుండా సాధారణ వ్యక్తిగా వచ్చి ఉంటే, మీ అందరితో కలిసి కింద కూర్చుని 'పవర్ స్టార్', 'ఓజీ' అని గట్టిగా అరిచేవాడిని" అని తన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి వ్యాఖ్యలతో సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
Admin
Studio18 News