Studio18 News - ANDHRA PRADESH / : రాజధాని అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజును పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)కి తరలించారు. అనంతరం ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. విశాఖపట్నం సమీపంలోని తగరపువలస వద్ద బుధవారం (జూన్ 11) కృష్ణంరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి ఆయనను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించిన తుళ్లూరు పోలీసులు, ఈ మధ్యాహ్నం వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కృష్ణంరాజును మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన (జూన్ 6) ప్రసారమైన సాక్షి టీవీ ఛానల్లోని ‘కేఎస్ఆర్ లైవ్ షో’ అనే చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతికి చెందిన మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలుచోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అనేక పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. ఈ క్రమంలో, అమరావతి జేఏసీ దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొన్నారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న సాక్షి టీవీకే చెందిన మరో పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
Admin
Studio18 News