Studio18 News - ANDHRA PRADESH / : అనంతపురంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, వాగు ఉద్ధృతితో జన జీవనం స్తంబించిపోయింది. కాలనీలు నీట మునిగాయి. నగరానికి అనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీల్లోకి నీరు చేరుకుంది. కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవహం పెరగడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పండమేరుకు వరద పోటెత్తడంతో ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ పూర్తిగా నీట మునిగింది. మరో వైపు కనగానపల్లి మండలం ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారి పైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పెట్రోల్ బంక్ లోకి నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి వరద పంటమేరులోకి ఉదృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉద్ధృతితో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
Admin
Studio18 News