Studio18 News - ANDHRA PRADESH / : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం కన్నుమూశారు. బుద్ధదేవ్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, బుద్ధదేవ్ భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు బెంగాల్ సీఎంగా పని చేశారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయల్లో కొనసాగారు. అయితే, 2011లో జరిగిన ఎన్నికలలో బుద్ధదేవ్ ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో బెంగాల్ లో 34 సంవత్సరాల సీపీఐ(ఎమ్) పాలన ముగిసింది. ఇక బుద్ధదేవ్ మరణం గురించి తెలుసుకుని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. "ప్రముఖ సీపీఐ(ఎమ్) నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మరణవార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా సేవకు అంకితమైన మహామనిషి. ప్రజా సేవ పట్ల ఆయన సరళత, అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆయన తన రాష్ట్రం ఆధునిక చరిత్రను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Admin
Studio18 News