Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : విజయవాడ గిరిపురంలో మహిళ ఆత్మహత్య కొడుకు ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణం కుటుంబంపై 20 మంది హిజ్రాలు దాడి చేశారని ఆరోపణ దాడితో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం రెండు రోజులు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి నిందితులను అరెస్ట్ చేయాలంటూ బంధువుల నిరసన విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు ప్రేమ వ్యవహారం కారణంగా కొందరు హిజ్రాలు దాడి చేశారన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గిరిపురం ప్రాంతానికి చెందిన గోపీచంద్, అదే ప్రాంతానికి చెందిన మంజుల అనే యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను వ్యతిరేకిస్తూ మంజుల తరఫున సుమారు 20 మంది హిజ్రాలు ఈ నెల 11వ తేదీన గోపీచంద్ ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడిలో గోపీచంద్తో పాటు అతని తండ్రి కుమార్బాబు, తల్లి కుమారి (40)పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ అనూహ్య పరిణామంతో, బహిరంగంగా జరిగిన దాడితో తీవ్ర ఆవేదనకు గురైన కుమారి, ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె కన్నుమూశారు. కుమారి మరణవార్త తెలియగానే బంధువులు ఆగ్రహంతో మాచవరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన హిజ్రాలను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న హిజ్రాలను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Admin
Studio18 News