Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ ను మరోమారు వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా పలు నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో బుధవారం 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. నాలుగు రోజుల పాటు ముంచెత్తిన వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం కాగా మరోమారు వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఓవైపు సహాయక చర్యలు చేపడుతూనే మరోవైపు లోతట్టు ప్రాంతాల నుంచి అధికారులు ప్రజలను తరలిస్తున్నారు. గోదావరి నదికి వరద పోటెత్తడంతో రాజమండ్రిలోని కంభాల చెరువు, శ్యామల సెంటర్ ముంపులో చిక్కుకున్నాయి. మంగళవారం రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఆదెమ్మ దిబ్బ, తుమ్మలోవ, కోర్లమ్మపేట వరదలో చిక్కుకున్నాయి. రాజమండ్రి సబ్ కలెక్టర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Admin
Studio18 News