Studio18 News - ANDHRA PRADESH / : AP Assembly Session 2024 : ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు సన్నద్ధమయ్యారు. సోమవారం ఉదయం 8:30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. మరోవైపు పసుపు రంగు దుస్తులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని టీడీఎల్పీ సూచించింది. ఉదయం 10గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. అయిదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనుంది. దీంతో మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. పూర్తిస్థాయి బడ్జెట్ ను అక్టోబరులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వైసీపీ ప్రభుత్వ పాలనపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మరో మూడు శ్వేత పత్రాలైన శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల అంశాలను సభలో విడుదల చేసి, శ్వేతపత్రాల్లోని అంశాలపై చర్చ పెట్టనున్నట్లు తెలిసింది.
Admin
Studio18 News