Studio18 News - ANDHRA PRADESH / : భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నష్టం అంచనాలకు కేంద్ర బృందం ఏపీకి వస్తోంది. రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఈ రోజు (గురువారం) కేంద్ర బృందం(ఇంటర్ మినిస్టీరియల్ టీం)పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి (డియం అండ్ పియం) సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో గల కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించి నేరుగా వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనుంది. అంతే కాకుండా వరద బాధితులతో నేరుగా మాట్లాడనుంది. ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డిఎంఏ) సలహాదారు కల్నల్ కెపి సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ (సీడబ్ల్యుసీ) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాదు ఎస్ఇ(కెసిసి) యం రమేశ్ కుమార్, ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్ గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్న ఉన్నారు.
Admin
Studio18 News