Studio18 News - ANDHRA PRADESH / : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం విషయమై ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రేషన్ బియ్యం వద్దనుకునే కార్డుదారులకు నగదు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజపేటలో చౌకధరల దుకాణం ద్వారా రేషన్ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించి వేలకోట్ల రూపాయలు దోచేశారు. ఇంటింటి రేషన్ పేరుతో కార్డుదారులనూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అందుకే రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడంతో పాటు ప్రజలను నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కూటమి సర్కార్ చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి నెలా ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు చౌకధరల దుకాణాల్లో రేషన్ అందుబాటులో ఉంటుంది. కార్డుదారుల ఇష్టప్రకారం బియ్యం బదులు నగదు, రాగులు, సజ్జలు ఇతర చిరుధాన్యాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని మంత్రి వెల్లడించారు.
Admin
Studio18 News