Studio18 News - ANDHRA PRADESH / : సంక్రాంతి పండుగకు ఆంధ్రాలోని తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిటీ వాసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్ టికెట్లను ఆన్ లైన్ లో రిజర్వ్ చేసుకుంటున్నారు. పండుగ సమీపిస్తే సీట్లు దొరికే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ముందే జాగ్రత్తపడుతున్నారు. దీంతో రిజర్వేషన్ కు రద్దీ పెరిగిందని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుకు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరించారు. ఏపీలోని పలు నగరాలకు రైళ్లు అందుబాటులో ఉండడంతో దాదాపు సగం జనం రైళ్లలో వెళతారని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ గతేడాది సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని వివిధ నగరాలకు కూడా సంక్రాంతి రద్దీ ఎక్కువే ఉండనుంది. కరీంనగర్ వంటి నగరాలకు రైల్వే కనెక్టివిటీ లేకపోవడంతో సామాన్యులు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించనున్నారు. దీంతో రైల్వే కనెక్టివిటీ లేని రూట్లలో బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి సమాచారం తెప్పించుకుని, దానికి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు.
Also Read : టీ20 వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు
Admin
Studio18 News