Studio18 News - ANDHRA PRADESH / : నిన్న నల్ల కండువాతో అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్న జగన్.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు దేశ రాజధానిలో ధర్నా చేయనున్నారు. అలాగే, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరోపక్క, జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చర్చల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆయన ఇష్టపడడం లేదని విమర్శించాయి. నిన్న ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండువాలతో సభకు హాజరైన జగన్.. ఆపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేస్తూ అసెంబ్లీని వాకౌట్ చేశారు. ఏపీలో అరాచక పాలన జరుగుతోందని, నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాకస్థాయికి చేరాయని ఆరోపించారు.
Admin
Studio18 News