Studio18 News - ANDHRA PRADESH / : 'పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గధామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా సాగుతుంది. ఈ దశలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన ఆదాయాన్ని, అభివృద్ధిని సాధించవచ్చు' అని ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో యూకే, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ తదితర పలు దేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్, ములగో ఫౌండేషన్స్ సి.ఇ.ఓ. కెవిన్ స్టర్, బియాండ్ నెట్ జీరో చైర్మన్ లార్డ్ జాన్ బ్రౌన్ తదితరులతో ఆయన చర్చలు జరిపారు. ఏపీలో వివిధ వాణిజ్య, పెట్టుబడి అవకాశాల గురించి వారి మధ్య చర్చ సాగింది. అలాగే రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం ఆంధ్రప్రదేశ్లో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ప్రధానంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి మంత్రి విజ్ఞప్తిపై వివిధ సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
Admin
Studio18 News