Studio18 News - ANDHRA PRADESH / : Dowleswaram Barrage : గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాల కారణంగా గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బ్యారేజ్ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. 175 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి 9లక్షల86వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలంటే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.ఏజెన్సీ ప్రాంతంలో వరద ప్రభావం పెరగడంతో గిరిజన వాసులు భయాందోళన చెందుతున్నారు. విలీన మండలాల్లో వాగులు వంకలతోపాటు శబరి, గోదారి ఉగ్రరూపం దాల్చడంతో సుమారు 200 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు – భద్రాచలం ప్రధాన రహదారిపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహయచర్యలు అందించేందుకు లాంచీలతో పాటు బఫ్ఫర్ స్టాక్ ను అధికారులు ఏర్పాటు చేశారు. దేవీపట్నం మండలం, సీతానగరం మండలాలపై వరద ప్రభావం తీవ్ర స్థాయి ఉంది.కోనసీమ ప్రాంతంలో పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద నాలుగు గ్రామాలకు నాటు పడవపై లంకవాసులు ప్రయాణం చేస్తున్నారు. పి గన్నవరం – పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే కనకాయలంక కాజ్ వే పైనుండి వరద నీరు ప్రవహిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని కలెక్టర్లు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు గోదావరి వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Admin
Studio18 News