Studio18 News - ANDHRA PRADESH / : Pawan Kalyan at kanakadurga temple : తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులు రావడంతో దేశవ్యాప్తంగా కలకలకం సృష్టించింది. వైసీపీ హయాంలో ఆలయ పవిత్రతను దెబ్బతీశారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఉదయం విజయవాడలోని ఇంధ్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం పవన్ ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేశారు. ఆ తరువాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్ 11రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. వచ్చే నెల 2వ తేదీన తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని.. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమల కొండపైకి పవన్ చేరుకోనున్నారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొని.. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు.
Admin
Studio18 News