Studio18 News - ANDHRA PRADESH / NTR District : ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుండి గుంటూరు జిల్లా గింజపల్లి వరకు ప్రతిరోజు ప్రయాణికులు పడవలపై రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే గురువారం కూడా రోజూలానే ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుంచి 30 మంది ప్రయాణికులతో ఒక పడవ బయల్దేరింది. అయితే నది మధ్యలోకి రాగానే పడవలోని ఇంజన్ బ్యాటరీ పనిచేయడం ఆగిపోయింది. దీంతో నది మధ్యలో పడవ నిలిచి పోయింది. అది కూడా కృష్ణానది ప్రవాహం భారీగా ఉన్న ప్రదేశంలో.. ఇక ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుంలో ఏమో అనేలోపే నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కృష్ణానది ప్రవాహంలో పడవ కొంత దూరం కొట్టుకుపోయి నిలిచిపోయింది. నదిలో పడవ కొట్టుకుపోవగాన్ని గమనించిన అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించారు. 30 మంది ప్రయాణికులతో సహా పడవని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు మొదట ఆందోళనకు గురయ్యారు. కానీ స్థానికుల సహాయంతో వాళ్ళందరూ ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.. పడవలో ప్రయాణం చేసే వారికి ఎలాంటి గాయాలు ప్రమాదం సంభవించలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ జిల్లా నుండి గుంటూరు జిల్లా వైపు ప్రతిరోజు ప్రయాణికులు పడవలపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా పడవలను నడిపిస్తూ.. కనీసం ప్రయాణికులు లైఫ్ జాకెట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
Admin
Studio18 News