Studio18 News - TELANGANA / HYDERABAD : ముషీరాబాద్ నియోజకవర్గంలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే దిశగా ఘనమైన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన్ మంత్రి సన్సద్ ఖేల్ మహోత్సవ్లో భాగంగా “బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026”ను వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. అక్షర స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడం, వారి ప్రతిభను వెలికి తీసి జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కే. లక్ష్మణ్ మాట్లాడుతూ ముషీరాబాద్ పరిధిలోని ప్రతి యువ క్రీడాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కావని, అవి ఆరోగ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే శక్తిగా నిలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం యువత మత్తు పదార్థాల వైపు మళ్లకుండా ఉండేందుకు క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, ఇలాంటి టోర్నమెంట్లు యువతను సరైన దిశలో నడిపిస్తాయని చెప్పారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోటీల అనంతరం విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఈ క్రీడా మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “క్రీడలతో ఆరోగ్యం – క్రీడలతో అభివృద్ధి” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ముషీరాబాద్లో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News