Studio18 News - TELANGANA / : Gossip Garage : ఆరు మంత్రి పదవుల భర్తీ. కొత్త పీసీసీ చీఫ్ నియామకం. నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఇవీ మూడు కాంగ్రెస్ పార్టీలో డైలీ ఎపిసోడ్ అయిపోయాయి. ఆశావహులకు సర్ది చెప్పడం ఓవైపు.. అధిష్టానం అనుమతి కోసం ప్రయత్నాలు మరోవైపు.. సీఎం రేవంత్రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. అందుకే వరుసపెట్టి ఢిల్లీ టూర్లు చేస్తూనే ఉన్నారు సీఎం రేవంత్. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సోనియాను కూడా కలిసి వస్తున్నారు. అయినా పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు మరోసారి హస్తినబాట పట్టారు ముఖ్యమంత్రి. చాలాకాలంగా పెండింగ్లో ఉంటున్న పీసీసీ చీఫ్ అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశాన్ని అధిష్టానంతో డిస్కస్ చేయనున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదాల మీద వాయిదాలు.. పీసీసీగా కొత్తవారికి అవకాశం.. మంత్రివర్గంలోకి మరి కొంతమందికి చోటుపై ముఖ్యనేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తుండటంతో పార్టీ వ్యవహారాలు పూర్తిస్థాయిలో చూసుకునేందుకు పీసీసీ చీఫ్ను నియమించాలని చూస్తోంది హైకమాండ్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారు. పీసీసీగా బీసీ లేదా ఇతర వర్గాలకు ఇవ్వాలనే ఆలోచన.. పీసీసీ చీఫ్గా, సీఎంగా రెండు పదవుల్లో కొనసాగుతున్నారు సీఎం రేవంత్రెడ్డి. జూన్ 27తో పీసీసీ చీఫ్గా రేవంత్ మూడేళ్ల పదవీకాలం ముగిసింది. కొత్త వారి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ప్రస్తుతం సీఎంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఉండటంతో.. పీసీసీగా బీసీ లేదా ఇతర వర్గాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. రేసులో మధుయాష్కీ, మహేశ్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, సంపత్ కుమార్, శ్రీధర్ బాబు.. పీసీసీ చీఫ్ పదవి కోసం బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. లంబాడ సామాజికవర్గానికి రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం దక్కలేదు కాబట్టి.. తనకు అవకాశం ఇవ్వాలని బలరాం నాయక్ కోరుతున్నారు. లంబాడ సామాజికవర్గం నుంచి ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి సంపత్ కుమార్, విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పీసీసీ రేసులో ఉన్నారు. ఇక మంత్రి శ్రీధర్బాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేతల పోటీ ఎక్కువ కావడంతో.. ముఖ్యనేతలు కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఆరు మంత్రి పదవులు.. పోటీలో 12 మంది.. ఒక నేతకు ఒక పదవి రూల్ అప్లై చేస్తే.. పీసీసీ చీఫ్ నియామకానికి, మంత్రివర్గానికి ముడిపడి ఉంటుంది. మంత్రివర్గంలో చోటు కోసం ఏకంగా డజను మంది నేతలు పోటీ పడుతున్నారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో నాలుగు మాత్రమే భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. రెండు బెర్తులను అలాగే ఖాళీగా ఉంచి మిగతా సమీకరణాలను బట్టి భర్తీ చేయాలని భావిస్తోంది. అయితే ఈ నాలుగు బెర్తులను భర్తీ చేయడం కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, గడ్డం వివేక్, ప్రేమ్సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మదన్మోహన్ రావు, శ్రీహరి ముదిరాజ్, మైనంపల్లి రోహిత్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అమాత్య రేసులో ఉన్న డజను మందిలో ఎవరికి అవకాశం దక్కనుందనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల క్వశ్చన్గానే ఉంది. ఈ సారైనా మంత్రివర్గం విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం వ్యవహారం కొలిక్కి వస్తుందా? పీసీసీతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తేల్చేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. తెలంగాణ పీసీసీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పీసీసీలుగా కొత్తవారికి బాధ్యతలు ఇవ్వాలని చూస్తోంది. తెలంగాణ అంశం ఎంతకు కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సారి పీసీసీ అంశాన్ని తేల్చేయాలని హైకమాండ్ భావిస్తోంది. అందుకే రాష్ట్ర ముఖ్యనేతలతో భేటీ కానుంది. ఈ సారైనా మంత్రివర్గం విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం వ్యవహారం కొలిక్కి వస్తుందా.? లేక మరోసారి వాయిదా పడుతుందా.? అనేది చర్చనీయాంశంగా మారింది.
Admin
Studio18 News