Studio18 News - TELANGANA / : ప్రధాని మోదీ, బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని... మోదీ, అదానీ కలిసి దేశ పరువు తీసేశారని విమర్శించారు. అదానీ అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అదానీపై వచ్చిన ఆరోపణలు, మణిపూర్ అల్లర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ సమీపంలో సీఎం భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ పరువు మంటకలిపిన అదానీపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. భారత వ్యాపార సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని... చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్బీఐ నివేదించడంతో అమెరికా ప్రభుత్వం చర్యలకు పూనుకుందని చెప్పారు. అదానీ అవినీతిపై చర్చించేందుకు, జేపీసీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని... అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లడం ఖాయమని రేవంత్ అన్నారు. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ నేతలు లొంగిపోయారని... అందుకే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని విమర్శించారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం లోక్ సభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామని అన్నారు.
Also Read : తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు
Admin
Studio18 News