Studio18 News - TELANGANA / NIRMAL : నిర్మల్ జిల్లాలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా లేక రైతులు అప్పుల పాలై వ్యాపారస్తుల వద్ద అత్యధిక వడ్డీతో డబ్బులు తీసుకొని సాగు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాల్లో చాలా మంది రైతులు పంటకు సరైన సమయంలో ఎరువులు అందకపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయని, రైతు భరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు అప్పుల భారంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అప్పుల బాధతో కొంతమంది రైతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రతి సీజన్కు సరైన సమయంలో రైతు భరోసా నిధులు అందేవని, ప్రస్తుతం అందకపోవడంతో గ్రామాల నుంచి వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు చిన్నచూపు చూడడం సరైన విధానం కాదని, వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సీపీఐ పార్టీ రైతుల పక్షాన నిలబడి నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎస్.ఎన్.రెడ్డి, నారాయణ, శ్రీనివాస్, రాజేశ్వర్, ముత్యం, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News