Studio18 News - TELANGANA / NIZAMABAD : మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తేనే సమాజం అభివృద్ధి దిశగా సాగుతుందని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు “హ్యాపీ ఉమెన్స్ డే” అనే ఆంగ్ల అక్షరాల రూపంలో కూర్చొని మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి రంగంలో మహిళలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు. కుటుంబ విలువలను కాపాడుతూ సమాజ పురోగతికి మహిళలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. మహిళల విద్య, సాధికారత, హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమాజం మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవభావం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తే దేశ అభివృద్ధికి మరింత దోహదం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Studio18 News