Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ ఇచ్చిన సవరణ నివేదికను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో బీసీ కులగణన, రిజర్వేషన్ అంశాలపై మంత్రివర్గం చర్చించింది. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకురాగా దానికి అమోదం తెలిపారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలకు వేర్వేరు బిల్లులకు తీర్మానం చేయాలని నిర్ణయించింది. గతంలో బీసీ రిజర్వేషన్లను 37 శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోనున్నట్లు క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ఒక తీర్మానం పెండింగ్లో ఉన్నపుడు మరో తీర్మానం చేయడం కుదరనందువల్ల ఇందుకు నిర్ణయించామని అన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు బలహీనవర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చి.. అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల అమలుకు రెండు వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాబోయే అసెంబ్లీలో చట్టం తేవాలని నిర్ణయించామని, ఆ మేరకు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపామని అన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక పాలసీ ఉండాలని తెలంగాణ పర్యాటక విధానం 2025-30ను ఆమోదించామన్నారు. దీని కింద రాష్ట్రంలోని 27 ప్రత్యేక కేంద్రాలను అభివృద్ధి చేసి, ఐదేళ్లలో రూ.15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు వచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. 2024 పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టులు, గురుకులాలకు 330 పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు.
Admin
Studio18 News