Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయం అక్రమ వసూళ్లకు అడ్డాగా మారింది.ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.దీనితో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు......... దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న అనుబంధ అలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కాగా... ప్రస్థుతం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా నిత్యం బద్ది పోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఇదే అదునుగా భావించిన కొందరు, భక్తుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి మొక్కుబడికి దేవస్థానం అధికారులు టికెట్లు నిర్ణయించినప్పటికి ఆలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. సి సి కెమెరాలు ఉన్నప్పటికీ ఏది చేసినా అడిగేవారు లేకపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పినట్టుగా కనిపిస్తోంది. “బోనం పెట్టుకోవడానికి 30 రూపాయల టికెట్ ఉన్నపటికి టికెట్లు ఇవ్వకుండా 50 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. “కొబ్బరికాయ కొట్టడానికి కూడా 10 నుండి 20 రూపాయలు అడుగుతున్నారు. బెల్లం సాకా పోసేందుకు టికెట్ ఇవ్వకుండా నేరుగా భక్తుల నుండి డబ్బులు తీసుకొని జేబులు నింపుకుంటున్నారు. “అధికారులకు చెప్పినా .. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.” అక్రమ వసూళ్లు బహిరంగంగానే జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం చూసీ చూడనట్టే వ్యవహరిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. “సౌకర్యాలు అసలు లేవని… పిల్లలు, వృద్ధులు అలమటిస్తున్నారని మండిపాటుకు గురవుతున్నారు.” డబ్బులు ఇవ్వకపోతే దుర్భాషలాడుతున్నారని, గతంలో భక్తులపై దాడులు జరిగినప్పటికీ ఆ విషయాలను అధికారులు బయటకు రానీయకుండా కప్పిపుచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ వసూళ్లు చేస్తున్నది కేవలం కాంట్రాక్టు సిబ్బందేనా? లేదా ఇందులో ఆలయ అధికారుల పాత్ర కూడా ఉందా? అనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ నిత్యం ఇలాంటి దోపిడీలు వెలుగులోకి వస్తున్నా దేవస్థానం అధికారులు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొబ్బరికాయలు కొట్టే కాంట్రాక్టర్ గడువు ముగియనున్న నేపథ్యంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన పాత కాంట్రాక్టర్కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నెలల తరబడి ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు ఈ ఘటనలపై విచారణ చేపట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల పై, ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, భక్తులను నిలువు దోపిడికి గురికాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
Also Read : Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు... నో పే!: అయ్యన్నపాత్రుడు
Admin
Studio18 News