Studio18 News - TELANGANA / HYDERABAD : SC నిరుద్యోగులు స్వయం ఉపాధి రుణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ శాఖ తరఫున SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని ప్రకటించడం సంతోషకరమని పేర్కొంటున్నారు. అయితే ఈ పథకానికి మార్చి 17 నుంచి 24 వరకు మాత్రమే గడువు ఇవ్వడం పూర్తిగా అన్యాయమని విమర్శిస్తున్నారు. ఇది నిజంగా పేదలకు సహాయం చేయడానికా లేదా కేవలం ఆశ చూపించడానికేనా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో, బస్తీల్లో ఉన్న చాలా మంది SC పేదలకు ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేకపోవడంతో వారు మళ్లీ అప్లై చేసి డాక్యుమెంట్లు సేకరించేలోపే గడువు పూర్తవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వారం లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. అమలు విధానం చూస్తే ఈ పథకం కూడా దళిత బంధు పథకం మాదిరిగా కొంతమంది నాయకులకు తెలిసిన వారికే పరిమితమైపోతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. MLAలకు దగ్గరగా ఉన్న కొద్ది మందికే ఈ అవకాశాలు దక్కితే నిజమైన పేదలకు ఈ పథకం ఎలా చేరుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా SC సామాజిక పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక నెల గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామం, ప్రతి బస్తీకి ఈ సమాచారం చేరేలా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు మాత్రమే లబ్ధి చేరేలా చూడాలని కోరుతున్నారు. MLAల అనుచరులకు కాకుండా నిజంగా అవసరమైన వారికి ఈ పథకం అందాలని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు కోసం ఎలా ప్రచారం చేస్తారో అదే విధంగా ఈ పథకాల గురించి కూడా ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Admin
Studio18 News