Studio18 News - TELANGANA / HYDERABAD : పరిగి మార్చి 24 (తెలంగాణ డైలీ న్యూస్): కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిగి నియోజకవర్గ సర్పంచులకు నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ సర్పంచులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులకు ప్రాధాన్యత ఇస్తూ, బీఆర్ఎస్ సర్పంచులకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. సోమవారం పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు సర్పంచులు మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్లో చేరితేనే నిధులు ఇస్తామని, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎర వేస్తూ, లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వమని బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి కృషి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలా మా పార్టీలో చేరితేనే నిధులు ఇస్తామంటూ చిల్లర రాజకీయాలకు పాల్పడలేదని విమర్శించారు. నిధులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Admin
Studio18 News