Studio18 News - TELANGANA / NIRMAL : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు శనివారం పట్టణంలోని హోటల్ మారుతి ఇన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం వివరాలను లబ్ధిదారులకు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పేదల ఉన్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. పేద ప్రజలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగగలరని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై అవసరమైన అవగాహన పెంపొందించుకొని వాటి మెలుకువలను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇండియన్ పోస్ట్స్ మేనేజర్ వీరస్వామి, పోస్టల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర యాదవ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ దినేష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
Studio18 News