Studio18 News - TELANGANA / : Telangana High Court: హైదరాబాద్ లోని చెరువులు, నాళాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. గత రెండుమూడు నెలలుగా హైడ్రా అంశం తెలంగాణ రాజకీయాల్లో రచ్చరేపుతోంది. అయితే, తాజాగా హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తక్షణమే హైడ్రా కూల్చివేతలను నిలిపివేయాలని పిటీషన్ లో పేర్కొన్నారు. పాల్ పిటీషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా కేఏ పాల్ కోర్టులో వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజులు ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. జీవో నెం.99పై స్టే విధించాలని, వెంటనే హైడ్రా కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పాల్ కోర్టును కోరారు. కోర్టు స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడు హైడ్రా కూల్చివేతలు ఆపలేమని స్పష్టం చేసింది. కోర్టు ప్రతివాదులు అయిన హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Admin
Studio18 News