Studio18 News - TELANGANA / HYDERABAD : బంజారాహిల్స్, మే 9: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ బస్తీని అనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని పాతబస్తీకి చెందిన ఆర్టీఏ కార్యాలయం (RTA Office) కోసం కేటాయించడం వివాదాన్ని రాజేసింది. పేదలు నివాసం ఉంటున్న ఫిలింనగర్ బస్తీల్లోని విద్యార్థుల కోసం జూనియర్ కాలేజీ, పేదల కోసం దవాఖాన నిర్మాణాల కోసం తాము ఎన్నో ఏండ్లుగా పోరాడుతుంటే ఖాళీ స్థలాలు లేవని చెప్పిన రెవెన్యూ అధికారులు.. వేరే నియోజకవర్గానికి చెందిన ఆర్టీఏ కార్యాలయానికి ఖరీదైన స్థలం ఎలా ఇస్తారంటూ స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండలం సర్వే నెంబర్ 403 టీఎస్-1, బ్లాక్ ఎఫ్, వార్డు 9లో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో పద్మాలయ అంబేద్కర్ బస్తీని ఆనుకుని ఉన్న 1.30 ఎకరాల ఖాళీ స్థలంలో జూనియర్ కాలేజీ నిర్మించాలంటూ స్థానికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఫిలింనగర్ 18 బస్తీల్లో సుమారు 1లక్షకు పైగా జనాభా ఉంటుందని, ఇక్కడ జూనియర్ కాలేజీ నిర్మిస్తే స్థానికులకు ప్రయోజనం ఉంటుందని ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసారు. ఇదిలా ఉండా ఈ స్థలాన్ని వెస్ట్జోన్ ఆర్టీఏ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయిస్తూ నెలరోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా స్థలాన్ని చదును చేసేందుకు పనులు జరుగుతున్నాయి. కొండప్రాంతం కావడంతో మట్టి డంపింగ్ చేస్తూ స్థలాన్ని చదును చేస్తున్నారు. కాగా ఈ విషయంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్తో పాటు స్థానికులు శుక్రవారం అక్కడకు వెళ్లి పనులను అడ్డుకున్నారు. పేద పిల్లల కోసం కాలేజీ నిర్మాణం చేయాల్సిన స్థలాన్ని వెస్ట్జోన్ ఆర్టీఏ కార్యాలయానికి ఎలా ఇచ్చారంటూ కార్పొరేటర్ వెంకటేష్ రెవెన్యూ అధికారులతో పాటు ఆర్టీఏ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రజల ఓట్లతో గెలిసిన దానం నాగేందర్ ఇక్కడి ప్రజలను గాలికి వదిలివేయడం దారుణమని ఆరోపించారు. పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీ పక్కనున్న 1.30 ఎకరాల స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయానికి కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెస్ట్జోన్ ఆర్టీఏతో మాకేం సంబంధం.. ప్రస్తుతం టోలీచౌకి సమీపంలోని నానల్నగర్లో ఓల్డ్ ముంబై రోడ్డుపై ఉన్న వెస్ట్జోన్ ఆర్టీఏ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్నందున తమకు స్థలం కేటాయించాలంటూ ఆరునెలల క్రితం జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో స్థలాన్ని చూడాలని కలెక్టర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్డీవో, షేక్పేట తహసీల్దార్ పద్మాలయ అంబేద్కర్నగర్ను అనుకుని కేరళ భవన్ స్థలం పక్కనున్న 1.30ఎకరాల స్థలాన్ని సూచించారు. దీంతో ఈ స్థలాన్ని ఆర్టీఏ ఆఫీసు కోసం కేటాయించారు. కాగా తమకు ఎలాంటి సంబంధం లేని వెస్ట్జోన్ ఆర్టీఏ కార్యాలయం కోసం మా బస్తీని అనుకుని ఉన్న స్థలాన్ని ఎలా కేటాయిస్తారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెస్ట్జోన్ ఆర్టీఏ పరిధిలోకి కార్వాన్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని అసిఫ్నగర్, గోల్కొండ, అహ్మద్నగర్, గోషా మహల్, జుమ్మెరాత్ బజార్, ఫస్ట్ లాన్సర్, మంగళ్హాట్, మాసాబ్ ట్యాంక్, రెడ్హిల్స్, టప్పా చబుత్రా, టోలీచౌకి, విజయనగర్ కాలనీ, మెహదీపట్నం ప్రాంతాలు వస్తాయి. ప్రస్తుతం ఓల్డ్ ముంబై రోడ్డులో ఉన్న వెస్ట్జోన్ కార్యాలయానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పద్మాలయ అంబేద్కర్నగర్కు తరలించడం మానుకోవాలని, షేక్పేట, టోలీచౌకి, పరిసర ప్రాంతాల్లో ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో ఆర్టీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వెంటనే స్థలం కేటాయింపును రద్దు చేయకపోతే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు తక్కువగా ఉండడంతో అనేక అభివృద్ది కార్యక్రమాలు ఆగిపోయాయని, ఉన్న స్థలాలను వేరే వారికి కేటాయిస్తే ఊరుకునేది లేదని తేల్చిచెబుతున్నారు.
Admin
Studio18 News