Studio18 News - TELANGANA / MAHABUBNAGAR : జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తారని, వారి ఫిర్యాదులను పరిశీలించి తగు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 119 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒక శాఖ నుండి మరొక శాఖకు అర్థం లేకుండా దరఖాస్తులను పంపించడం సరైన పద్ధతి కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్, అటవీ శాఖ, డీఆర్డీఏ, ప్రణాళిక శాఖ, గనుల శాఖ, భూ సేకరణ విభాగాలకు చెందిన అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ వివరణ కోరారు. వచ్చే వారంలోపు అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి, గత వారం అందిన దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించినవి, ఇంకా పెండింగ్లో ఉన్నవి వంటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను స్పష్టమైన నమూనాలో సమర్పించాలని ఆదేశించారు. అనంతరం 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా స్థాయిలో రోజువారీ షెడ్యూల్ ప్రకారం ప్రజలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ప్రతి రోజు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలను కార్యక్రమం అనంతరం జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూపులో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తారని, పంచాయతీ స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. నూతన జిల్లా కలెక్టర్ను జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు జగపతి రావు, ఎం. బాలయ్య, అశోక్ కుమార్, నాగభూషణం, కోటి రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పూలగుచ్ఛాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు. వారు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ, జడ్.పి.సి.ఈ.ఓ, ఇన్చార్జి డి.పి.ఓ వెంకట్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ నర్సింహులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News